న్యూఢిల్లీ: మణిపూర్ ఘర్షణలు (Manipur Clashes) తాజాగా ఢిల్లీ యూనివర్సిటీకి వ్యాపించాయి. క్యాంపస్లో ఉంటున్న కుకీ విద్యార్థులు శనివారం నిరసనకు దిగారు. మెయిటీ వర్గానికి చెందిన విద్యార్థులు గురువారం రాత్రి తమపై దాడి చేసినట్లు ఆరోపించారు. శుక్రవారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట కుకీ విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణకు దిగిన కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా, మణిపూర్లో మెజారిటీ వర్గమైన మెయిటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని జిల్లాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 50 మందికిపైగా మరణించారు.
మరోవైపు మణిపూర్లో పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీతోపాటు అస్సాం రైఫిల్స్ను మోహరించారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ను (సీఆర్పీఎఫ్) కూడా రప్పించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పది కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను (సీఏపీఎఫ్) కూడా ఘర్షణ ప్రాంతాలకు తరలించారు. దీంతో పరిస్థితి కొంత మెరుగుపడినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.