ఇంఫాల్, నవంబర్ 26: ఇంఫాల్ లోయ కేంద్రంగా పనిచేసే ఓ తిరుగుబాటు గ్రూపుతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని, త్వరలో వారితో ఒక శాంతి ఒప్పందం చేసుకొంటామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం వెల్లడించారు. శాంతి చర్చలు తుది దశలో ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ఆ గ్రూపు పేరు ఏంటో మాత్రం వెల్లడించలేదు.
ఈ ఏడాది మే 3న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రెండు జాతుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఇటువంటి శాంతి చర్చలు చేపడుతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా చెప్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, నిషేధిత యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూఎన్ఎల్ఎఫ్)తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని అంతకుముందు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలతో గత కొన్ని నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 180 మందికి పైగా మరణించగా, ఇంకా వందల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి.