Manipur | ఇంఫాల్, సెప్టెంబర్ 27: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేసి, హత్య చేసిన విషయం తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యను నిరసిస్తూ విద్యార్థులు రెండో రోజు బుధవారం కూడా ఇంఫాల్ నగరంతోపాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు. మరోవైపు రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 19 పోలీసుస్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మినహా రాష్ట్రం మొత్తాన్ని ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర గవర్నర్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఏఎఫ్ఎస్పీఏను అమలు చేయని పోలీసుస్టేషన్ల పరిధిలోని జాబితాలో ఇంఫాల్, లంఫేల్, సెక్మాయ్, లంసంగ్, పస్తోల్, జిర్బమ్ తదితర ఏరియాలు ఉన్నాయి. చట్టం అమలును మినహాయించిన ప్రాంతాలు ఎక్కువగా రాష్ట్రంలో మెజార్టీలైన మైతీల ఆధిపత్యం ఉండేవే కావడం గమనార్హం. తద్వారా రాష్ట్ర పోలీసుల అనుమతి లేకుండా ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు ఆయా 19 పోలీసుస్టేషన్ల పరిధిలో తమ కార్యకలాపాలు నిర్వహించలేవు. ఉగ్ర గ్రూపుల ఉనికిని గుర్తించేందుకు రాష్ట్రం మొత్తాన్ని చట్ట పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని భద్రతా సంస్థల వర్గాలు వెల్లడించాయి. నిషేధిత యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏ, కేవైకేఎల్ తదితర ఉగ్రసంస్థలు ఇంఫాల్ లోయలో తమ స్థావరాలను ఏర్పరుచుకొంటున్నాయని, ఆందోళనకారుల్లో కలిసిపోయి హింసను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నదని హెచ్చరించాయి.
హత్యలను నిరసిస్తూ ఇంఫాల్ నగరంలో నిర్వహించిన ర్యాలీకి విద్యార్థులు పెద్దయెత్తున హాజరయ్యారు. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ ఇంఫాల్లోని సెక్రటేరియట్కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 200 మీటర్ల దూరంలో ఆందోళనకారులను అడ్డుకొన్న పోలీసులు, వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయడంతోపాటు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్టు సమాచారం. ఘర్షణల నేపథ్యంలో రాజధాని ఇంఫాల్లో మరోసారి కర్ఫ్యూ విధించారు. కాగా, విద్యార్థుల హత్య కేసును మణిపూర్ ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి అప్పగించింది.
గత ఐదు నెలలుగా కొనసాగుతున్న మణిపూర్ హింసాకాండలో హత్య, లైంగిక దాడులకు గురైన గిరిజనుల ఘటనలపై సీబీఐ విచారణకు ఆదేశించడంలో జాప్య్యాన్ని నిరసిస్తూ కుకీ గ్రూపు ఐటీఎల్ఎఫ్ మహిళా విభాగం చురాచంద్పూర్లో భారీ ఆందోళన చేపట్టింది. విద్యార్థుల మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. గిరిజన మహిళపై లైంగిక దాడులు, నగ్నంగా ఊరేగించడం, కుకీ వర్గ ప్రజలను హత్య చేసిన ఘటనలు చాలా ఉన్నప్పటికీ, సీబీఐ విచారణ ఎందుకు వేయరని ఐటీఎల్ఎఫ్ నేత మేరీ జోన్ ప్రశ్నించారు. తమపై ఎందుకు ఈ పక్షపాత వైఖరి అని బీరేన్ సర్కార్ను నిలదీశారు.