మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలుండగా 32 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. అయితే ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్పై సొంత ఎమ్మెల్యేల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం.. కొత్త వారిని తెరపైకి తెస్తుందా? లేదంటే బీరేన్ సింగ్నే తిరిగి సీఎంగా ప్రకటిస్తుందా? అన్నది చూడాలి.
ఇది ఇలా కొనసాగుతుండగానే.. బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లారు. అధిష్ఠానం ముఖ్యులతో భేటీ కానున్నారు. సీఎం బీరేన్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు శారదా దేవి, సీనియర్ మంత్రి తోంగం విశ్వజిత్… ఈ ముగ్గురూ ఢిల్లీకి వెళ్లారు. అయితే విడివిడిగానే అధిష్ఠానం పెద్దలు సమావేశం కానున్నారు. కేవలం సీఎం అభ్యర్థిత్వం విషయంపైనే ఈ ముగ్గురూ ఢిల్లీ వెళ్లారని రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. ఇక… మణిపూర్ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజుకి అధిష్ఠానం అప్పజెప్పింది. ఈ ముగ్గురూ మణిపూర్ వెళ్లారు.
రెండు గ్రూపులుగా విడిపోయారు..
ప్రభుత్వ ఏర్పాటు దగ్గర పడుతున్న వేళ… సీఎం పీఠం విషయంలో నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. సీఎం బీరేన్ సింగ్ ఇప్పటికే ఓ రౌండు ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయన ఓ అంచనాకు వచ్చే ఢిల్లీ వెళ్లినట్లు ఆయన శిబిరం పేర్కొంటోంది. ఇక… రాష్ట్ర అధ్యక్షుడి శిబిరం మరో వైపు.. ప్రస్తుతం ఈ రెండు శిబిరాల మధ్యే పోటీ నెలకొందని పేర్కొంటున్నారు.