Maharastra elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra elections) పోలింగ్కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ‘సంకల్ప్ పత్ర’ పేరుతో దీనిని విడుదల చేసి మాట్లాడారు. అ మ్యానిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని అన్నారు. యువకులు, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు.
నైపుణ్య గణన, స్టార్టప్ల అభివృద్ధి కోసం శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్లు, వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (Maha Vikas Aghadi) పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష కూటమి వాగ్దానాలను విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ అనుమతించదని పునరుద్ఘాటించారు.
మహారాష్ట్రలో సుస్థిరమైన, విశ్వసనీయమైన పరిపాలన ఉండాలంటే మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. రాష్ట్రాన్ని వికసిత్ మహారాష్ట్రగా మార్చేందుకు రోడ్ మ్యాప్ను రూపొందించామన్నారు.