బెంగళూరు : కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగిస్తున్నట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు వెల్లడించారు.
శనివారం రోజు కదులుతున్న ఆటోలో పేలుళ్లు సంభవించిన విషయం విదితమే. దీంతో అక్కడ భారీగా పొగలు కమ్ముకున్నాయి. అనంతరం వెహికల్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ పేలుడు ఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనను మొదట ప్రమాదంగా భావించారు. కానీ ఆదివారం డీజీపీ ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈ పేలుళ్లతో ఉగ్రవాదులకు సంబంధం ఉందని తేల్చారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. తక్కువ సామర్థ్యం ఉన్న ఐఈడీ పేలినట్లు పోలీసులు నిర్ధారించారు.
అయితే నిందితుడు షారిక్ ఆటోలో కుక్కర్లో బాంబును తరలిస్తుండగా ఈ పేలుడు జరిగింది. షారిక్పై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఒక కేసు శివమొగ్గలో, మరో రెండు కేసులు మంగళూరులో నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. షారిక్ ఉంటున్న ఇంట్లో చాలా వరకు పేలుడు పదార్థాలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొన్నింటిని ఆన్లైన్లో, కొన్ని ఆఫ్లైన్లో కొన్నట్లు గుర్తించారు.
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థతో షారిక్ పనిచేశాడని, ఆ సంస్థకు చెందిన అల్ హింద్ అనే గ్రూపుతో అతనికి లింకులు ఉన్నట్లు తేల్చారు. అరాఫత్ అలీ అనే వ్యక్తితో షారిక్కు సంబంధాలు ఉన్నాయన్నారు. అల్ హింద్ మాడ్యూల్ కేసులో ఆ ఇద్దరూ నిందితులే. షారిక్తో లింకున్న వారిని గుర్తిస్తున్నామని పోలీసులు చెప్పారు.