లక్నో: ఆడవాళ్ల అందంపై బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ(Maneka Gandhi) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. గాడిద పాల(Donkeys Milk)తో చేసిన సబ్బును వాడితే, ఆడవాళ్లు అందంగా కనిపిస్తారని ఆమె అన్నారు. యూపీలోని సుల్తాన్పూర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర(Cleopathra) గాడిద పాలతోనే స్నానం చేసేదని ఆమె తెలిపారు. గాడిద పాలతో చేసిన సబ్బులు ఢిల్లీలో ఒక్కటి రూ.500కు అమ్ముతున్నట్లు చెప్పారు. మనం ఎందుకు మేక, గాడిద పాలతో సబ్బులు చేయకూడదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
కశ్మీర్లోని లడాఖ్(Ladakh) ప్రాంతంలో ఉన్న ఓ వర్గం వాళ్లు గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తారని, మీరెన్నాళ్ల క్రితం గాడిదను చూశారని, ఆ జంతువుల సంఖ్య తగ్గుతోందని మేనకా గాంధీ అన్నారు. దోబీవాళ్లు(washermen) కూడా వాటిని వాడడం లేదన్నారు. లడాఖ్లో ఉన్న ఓ కమ్యూనిటీ ప్రజలు గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తున్నారని, ఆ సోప్లతో మహిళలు ఎప్పటికీ అందంగా కనిపించవచ్చు అని ఆమె అన్నారు.
చెట్లు అంతరిస్తున్నాయని, దీంతో కట్టెలు కొనడం ఖరీదు అవుతోందన్నారు. దీని వల్లే దహన(cremation) ఖర్చులు కూడా పెరిగినట్లు ఆమె చెప్పారు. శ్మశాన వాటికల్లో వాడే కట్టెలకు ఇప్పుడు 20 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, అయితే వాటికి బదులుగా ఆవు పేడను వాడాలన్నారు. దీని వల్ల దహన సంస్కారాల ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నట్లు మేనకా గాంధీ తెలిపారు.