న్యూఢిల్లీ : సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కొత్త వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40లక్షల మందికిపైగా ఆరోగ్య సేవలు, టెలీ కన్సల్టేషన్ సౌకర్యాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (Central Government Health Scheme) లబ్ధిదారులు నేరుగా నిపుణుల సలహాలు పొందవచ్చని కేంద్రమంత్రి తెలిపారు.
భారత్లో పెరుగుతున్న డిజిటల్ వ్యాప్తికి అనుగుణంగా ఓ కీలకమైన, సమయానుకూలమైన ముందడుగని పేర్కొన్నారు. అందుబాటులోకి వచ్చిన కొత్త సౌకర్యంతో ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రజలు నేరుగా ఆరోగ్య సేవలు పొందవచ్చని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. మెరుగైన సౌకర్యాలతో సులభంగా సేవలందించడంతో పాటు లబ్ధిదారులకు మరింత చేరువ కావడమే సీజీహెచ్ఎస్ లక్ష్యమని తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కరోనా పరిస్థితులపై ఆయన జమ్మూ కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, లడఖ్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్ ఆరోగ్యశాఖ మంత్రులతో ఆయన సమీక్షించనున్నారు.