లక్నో: ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు, 18 మంది పిల్లలున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ అయిన అతడికి ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ బంధాన్ని ముగించాలని భావించిన ప్రియురాలు అతడ్ని హత్య చేసింది. (Man With 18 Children Killed By Lover) ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుమేర్పూర్ గ్రామం మాజీ సర్పంచ్ ముస్తాకా గుల్షన్ అలియాస్ మున్నాకు ఇద్దరు భార్యలున్నారు. ఒక్కో భార్య ద్వారా ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు చొప్పున మొత్తం 18 మంది పిల్లలున్నారు. ఒక కుమార్తెకు వివాహమైంది.
కాగా, ఆ గ్రామానికి చెందిన సుమన్ దేవి భర్త పని నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తున్నాడు. దీంతో ఒంటరిగా ఉంటున్న ఆమెకు మున్నా సహాయం చేసేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనను తరచుగా కలవాలని సుమన్ దేవిని మున్నా ఒత్తిడి చేయడంతోపాటు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
మరోవైపు మున్నా వేధింపుల నేపథ్యంలో అతడితో సంబంధాన్ని ముగించాలని సుమన్ దేవి భావించింది. దీంతో అతడ్ని అంతం చేయాలని ఆమె నిర్ణయించింది. తన సోదరుడితో కలిసి ప్లాన్ వేసింది. మార్చి 18న మున్నాను తన పుట్టింటికి సుమన్ దేవి పిలిచింది. అతడు ఆ ఇంటికి చేరుకోగా ఆమె సోదరుడు, అతడి సహచరులు కలిసి ఐరాన్ రాడ్లతో కొట్టి చంపారు. మున్నా మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి కాలువలో పడేశారు.
కాగా, మున్నా అదృశ్యంపై అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మున్నా బైక్ను ఒకచోట గుర్తించారు. మొబైల్ ఫోన్ కాల్ రికార్డ్స్ ద్వారా ప్రియురాలు సుమన్ దేవిని అతడు కలిసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు మున్నాను హత్య చేసినట్లు సుమన్ దేవి ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. మార్చి 22న కాలువలో పడేసిన గోనె సంచిలో ఉన్న మున్నా మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు.
నిందితులైన ప్రియురాలు సుమన్ దేవి, ఆమె సోదరుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం వెతుకుతున్నట్లు వివరించారు. త్వరలో జరుగనున్న గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మున్నా సిద్ధమవుతున్నట్లుగా తెలిసిందని ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Kashmiris Donations To Iran | కశ్మీర్ ప్రజల విరాళాలు.. ఈ దయ మరువలేనిదన్న ఇరాన్
Watch: ఆలయంలో రెచ్చిపోయిన పూజారులు.. భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు