Bihar | పాట్నా : పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ వద్దకు దూసుకెళ్లేందుకు ఓ యువకుడు యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ యువకుడిని అడ్డుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ముంగేర్ జిల్లాకు చెందిన నితీశ్ కుమార్(26) తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం సభా వేదిక వద్దకు దూసుకెళ్లేందుకు యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న సీఎం భద్రతా సిబ్బంది.. నితీశ్ను అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. అయితే నితీశ్ కుమార్ తండ్రి రాజేశ్వర్ పాశ్వాన్ బీహార్ మిలిటరీ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొన్నేండ్ల క్రితం చనిపోయారు. తన తండ్రి విధి నిర్వహణలో చనిపోవడం కారణంగా, తాను ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడినని నితీశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే సీఎంను డిమాండ్ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి ఈ ఘటనపై పాట్నా జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.