న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని శకార్పూర్ ఏరియా లక్ష్మినగర్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నాలుగంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మొదలైన మంటలు క్రమంగా నాలుగో ఫ్లోర్ వరకు పాకాయి. ఈ ఘటనలో ఓ 55 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. మరో 9 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. భవనంలో చిక్కుకున్న 25 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా వెలికి తీసుకొచ్చారు.
అయితే, రెండో అంతస్తులోని కమల్ తివారీ (40) కుటుంబం ఘటన జరిగినప్పుడు గాఢ నిద్రలో ఉంది. వెంటనే తేరుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ మెయిన్డోర్ అప్పటికే మంటల్లో చిక్కుకుంది. దాంతో ఇంట్లో ఉన్న నీళ్లు చల్లి తమ పోర్షన్లోకి మంటలు రాకుండా అపేందుకు ప్రయత్నించారు. అరగంట ప్రయత్నించినా మంటలు తగ్గకపోగా మరింత పెరిగాయి. దాంతో వేరే దారిలేక కమల్ తివారీ తన మూడేండ్ల కొడుకు బ్లాంకెట్లో చుట్టి కిందకు విసిరేశాడు. అనంతరం 12 ఏళ్ల కొడుకును, భార్య ప్రియాంక (36)ను కిందకు దూకమని, ఆఖరికి తను కూడా దూకేశాడు.
ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. కమల్ తివారీకి, అతని కొడుకులు ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, ప్రియాంక స్వల్ప గాయాలతో తప్పించుకుంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో కమల్ తివారీ బ్లాంకెట్లో చుట్టి విసిరేసిన చిన్న కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.