బెంగళూరు: కులాంతర వ్యక్తిని కుమార్తె ప్రేమించడం నచ్చని ఒక వ్యక్తి ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు (Man Strangles Daughter ). ఈ విషయం తెలిసిన ప్రియుడు వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లోని బంగారుపేటలో నివసిస్తున్న కృష్ణమూర్తికి 20 ఏళ్ల కుమార్తె కీర్తి ఉన్నది. వేరే కులానికి చెందిన 24 ఏళ్ల గంగాధర్ ఆమె మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే దీనిపై తండ్రి, కుమార్తె మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, మంగళవారం ఉదయం కుమార్తె కీర్తికి నచ్చజెప్పేందుకు తండ్రి కృష్ణమూర్తి ప్రయత్నించాడు. గంగాధర్తో ప్రేమ వ్యవహారం మానుకోవాలని చెప్పాడు. ఈ సందర్భంగా తండ్రి, కుమార్తె మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహించిన కృష్ణమూర్తి కుమార్తె కీర్తి గొంతు నొక్కి ఆమెను హత్య చేశాడు. అనంతరం కుమార్తె మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హత్య కేసు నమోదు చేసి కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు.
మరోవైపు ప్రియురాలు కీర్తి హత్య విషయం ప్రియుడు గంగాధర్కు తెలిసింది. దీంతో అతడు తీవ్ర మనస్తాపం చెందాడు. వెంటనే రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. వేగంగా వస్తున్న రైలు ముందు దూకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు గంగాధర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు. ఈ రెండు సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు.