Viral news : కార్లను సాధారణంగా ఒక పెట్టుబడిగా లేదా రవాణా సాధనంగా భావిస్తుంటారు. అయితే కొందరికి అవి కేవలం విలువైన వస్తువులు మాత్రమే కాదు, వాటితో బలమైన భావోద్వేగ అనుబంధం కూడా ఏర్పర్చుకుంటారు. తమ వాహనాలను ఆత్మీయ నేస్తాలుగా భావించే యజమానులు, వాటిని తరచుగా కుటుంబసభ్యుడిని చూసుకున్నట్లే ఎంతో శ్రద్ధతో చూసుకుంటారు. అలాంటి ఓ యజమానికి సంబంధించిన ఘటనే ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్గా మారింది.
వరదలో ఒక యజమాని తన కారు నీట మునిగిపోకుండా లేదా కొట్టుకుపోకుండా కాపాడుకోవడానికి దానిని గట్టిగా పట్టుకుని తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. పూర్తిగా నీటిలో మునిగిపోయిన కారును వెనుక డోరు దగ్గర పట్టుకుని అతను వరదలో నిలబడ్డాడు. ఆ కారును బయటికి లాగేందుకు జేసీబీ వచ్చే వరకు అతను ఛాతీ లోతు నీళ్లలో నిలిచి ఉన్నాడు.
ఇంతలో జేసీబీ వచ్చి కారును బయటికి లాగింది. జేసీబీ కారును బయటికి లాగే సమయంలో కూడా ఆ కారు యజమాని జేసీబీకి సాయంచేశాడు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో ఇప్పుడు లక్షలాది వీక్షణలను అందుకుంది. ఇంకా వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. చాలామంది నెటిజన్లు కారు యజమానిపట్ల సానుభూతిని ప్రకటించారు. మరికొందరు ఈ ఘటనను హృదయ విదారకంగా భావించారు. ఇంకొందరు నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యాన్ని, అతనికి తన వాహనంపట్లగల భావోద్వేగాలను ప్రశంసించారు.
కాగా, ఈ వీడియోలో కనిపిస్తున్న కారు ‘టాటా నెక్సాన్ EV’ (Tata Nexon EV) కి పాత వెర్షన్. కారు నీటిలో మునిగిపోయినప్పటికీ, దానిలోని కొన్ని ఫంక్షన్లు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. వాహనం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. వైపర్లు కూడా పనిచేస్తున్నాయి. ఇది ‘MY2020’ వెర్షన్ అనిపిస్తోంది. ఇందులో 30.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రస్తుత వెర్షన్ ప్రారంభ ధర రూ.12.49 లక్షలుగా ఉంది.