ముంబై: బాంబు లేకపోయినా బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన ఓ నిందితుడికి ముంబై పోలీసులు బుద్ధిచెప్పారు. దక్షిణ ముంబైలోని కల్బాదేవి ఏరియాకు చెందిన 24 ఏండ్ల యువకుడు ఆదివారం ఉదయం పోలీసులకు ఫోన్చేసి జంఖేడ్ ఏరియాలో బాంబు ఉందని చెప్పాడు. మరికాసేపటికే జవేరీ బజార్ ఏరియాలోని తినుబండారాల వీధి అయిన ఖవూ గల్లీలో బాంబు ఉందన్నాడు.
దాంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి బాంబు కోసం వెతికారు. కానీ ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది పోకిరీ పనేనని నిర్ధారించుకుని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో మొబైల్ నంబర్ను ట్రేస్ చేసిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు కల్బాదేవి ఏరియాకు చెందిన దినేశ్ సుతార్గా గుర్తించారు. సోలాపూర్ జిల్లాలోని సంగోలా ఏరియాకు చెందిన అతను 10 రోజుల క్రితమే బంధువులతో గొడవపడి ముంబైకి వచ్చినట్టు విచారణలో తేలింది. అంతకుముందే నిందితుడికి అతని గర్ల్ఫ్రెండ్తో బ్రేక్ అప్ అయ్యిందని, అప్పటి నుంచి పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు.