బెంగళూరు: క్యాటరింగ్ సిబ్బంది తీరుపై ఆగ్రహానికి గురైన ఒక వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో రైలు మొత్తం తనిఖీ చేశారు. నిద్రపోతున్న ప్రయాణికులను కూడా లేపి వారి బ్యాగులను పరిశీలించారు. బాంబును కనుగొనలేకపోవడంతో చివరకు ఆకతాయి ఫోన్ కాల్గా గుర్తించారు. న్యూఢిల్లీ-కర్ణాటక ఎక్స్ప్రెస్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు అరగంట వరకు ఆ రైలు నిలిచిపోయింది.
ఢిల్లీకి చెందిన సత్యానంద్ సోదరుడు ఢిల్లీ-కర్ణాటక ఎక్స్ప్రెస్లో మంగళవారం ప్రయాణించాడు. రైలులోని క్యాటరింగ్ సిబ్బంది వల్ల ఇబ్బంది కలిగిన విషయాన్ని సత్యానంద్కు చెప్పాడు. దీంతో అతడు ఆ రైలులో బాంబ్ ఉన్నదంటూ రైల్వే హెల్ప్ లైన్కు ఫోన్ చేశాడు. ఆర్పీఎఫ్కు ఆ సమాచారం అందగా మంగళవారం రాత్రి మధుర జంక్షన్లో ఆ రైలును సుమారు అరగంట నిలిపివేశారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో ప్రతి బోగిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలో నిద్ర పోతున్న ప్రయాణికులను కూడా లేపి వారి లగేజ్ను రైల్వే పోలీసులు సోదా చేశారు. అనుమానాస్పదంగా ఏమీ లేదని నిర్ధారించిన తర్వాత రైలు కదిలేందుకు అనుమతించారు. అది ఫేక్ ఫోన్ కాల్గా రైల్వే పోలీసులు గుర్తించారు. నంబర్ ఆధారంగా ఢిల్లీలోని అరుణా అసఫ్ అలీ రోడ్లో ఉన్న నైట్ షెల్టర్లో మద్యం సేవించిన సత్యానంద్ను బుధవారం అరెస్ట్ చేశారు.