షోలాపుర్: మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూడటంతోపాటు స్కూల్లో విద్యార్థినులను వేధిస్తున్నాడని 14 ఏండ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఎవరకీతెలియకుండా బాలుడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్లో (Solapur) గత నెల 13న జరిగింది. నిందితుడు విజయ్ బట్టు (Vijay Battu) మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి విశాల్ అనే కుమారుడు ఉన్నాడు. విశాల్ (Vishal) దగ్గర్లోని పాఠశాలలో చదువుకుంటున్నాడు. రోజూ స్కూలుకు ఫోను తీసుకువెళ్లి అక్కడ అశ్లీల చిత్రాలు (Obscene Videos) చూసేవాడు. అంతటితో ఆగకుండా పాఠశాలలో బాలికలను వేధించేవాడు. ఇదే విషయాన్ని ఉపాధ్యాయులు పలుమార్లు తండ్రి దృష్టికి తీసుకొచ్చారు. విసుగెత్తిపోయిన విజయ్.. జనవరి 13న కుమారుడిని తన బైక్పై తుల్జాపూర్ (Tuljapur) రోడ్డుకు తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఓ కూల్డ్రింగ్ తీసుకున్నాడు. విశాల్కి ఇచ్చేముందు అందులో విషం కలిపాడు. దానిని తాగిన విశాల్.. కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో అతడిని సమీపంలో ఉన్న కాలువలో పడేసి వచ్చాడు.
సాయంత్రం ఇంటికి చేరుకున్న విజయ్.. తన భార్యతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విజయ్ ఇంటికి దగ్గర్లోని మురికికాల్వలో మృతదేహం కనిపించింది. దొరికిన ఆధారాలకు, మృతుడి తండ్రి చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం రావడంతో.. ఎలాగైనా దొరికిపోతానని గ్రహించిన విజయ్.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో హత్యకేసు నమోదుచేశారు.