భోపాల్: పొగాకు ఇవ్వనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి వదిన, ఆమె కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. (Man Kills Nephew With Axe) ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బియోహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కాచ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల రామ్లా కోల్ శనివారం రాత్రి పెద్ద అన్న భార్య అయిన 35 ఏళ్ల వదిన సుఖి బాయిని పొగాకు అడిగాడు. పొగాకు ఇంట్లో లేదని ఆమె చెప్పింది. ఆగ్రహించిన అతడు రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లాడు. నిద్రిస్తున్న వదిన, కుమారుడి వరుసైన ఐదేళ్ల బాలుడిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, గొడ్డలి దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన సుఖి బాయికి చికిత్స అందిస్తున్నారు. నిందితుడైన రామ్లా కోల్ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.