పనాజీ: ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ప్రియుడు ఆగ్రహించాడు. తర్వాత రోజు దీనిపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అతడు కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. (Man Kills Girlfriend) మృతదేహాన్ని కారులో తరలించి కొండ ప్రాంతంలో పడేశాడు. గోవాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏండ్ల కామాక్షి నాయక్ పోర్వోరిమ్ ప్రాంతంలోని ఒక ఇంట్లో నివసిస్తున్నది. 22 ఏండ్ల ప్రియుడు ప్రకాష్ చుంచువాడ్, ఆమె మధ్య బుధవారం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మపుసా పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ప్రకాష్ను హెచ్చరించి వదిలేశారు.
కాగా, ప్రియురాలు కామాక్షి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ప్రియుడు ప్రకాష్ ఆగ్రహించాడు. గురువారం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తరలించి మహారాష్ట్రలోని అంబోలి ఘాట్ ఏరియాలో పడేశాడు.
మరోవైపు కామాక్షి కుటుంబ సభ్యుల్లో ఒకరు గురువారం ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆమె లేకపోవడం, నేలపై రక్తం మరకలు ఉండటం చూసి ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. కామాక్షి మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా ప్రియురాలు కామాక్షిని హత్య చేసి మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. దీంతో కొండ ప్రాంతంలో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.