జైపూర్: తండ్రితో గొడవ నేపథ్యంలో ఆగ్రహించిన కొడుకు కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టాడు. (Man Kills Father, Buries In House) తండ్రి కనిపించకపోవడంపై మిగతా సోదరులు అతడ్ని ప్రశ్నించాడు. తొలుత తనకు తెలియదన్న ఆ వ్యక్తి చివరకు తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 60 ఏళ్ల రాజేంగ్ బరాండాకు నలుగురు కుమారులు. పెద్ద కొడకు ప్రకాష్ తన తల్లితో కలిసి అహ్మదాబాద్లో నివసిస్తున్నాడు. ఇద్దరు కుమారులైన దినేష్, పప్పు బల్వారా గ్రామంలో ఉంటున్నారు. చిన్న కుమారుడు చున్నీలాల్ వేరుగా ఉంటున్న ఇంట్లో తండ్రి కూడా నివసిస్తున్నాడు.
కాగా, ఈ నెల 20న చిన్న కుమారుడు చున్నీ లాల్ తన తండ్రి రాజేంగ్తో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు పదునైన ఆయుధంతో తండ్రిని హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి ప్రాంగణంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే తండ్రి రాజేంగ్ రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుమారులు దినేష్, పప్పు ఆందోళన చెందారు. అహ్మదాబాద్లో ఉంటున్న అన్న ప్రకాష్కు ఈ విషయం చెప్పారు.
మరోవైపు ప్రకాష్ హుటాహుటిన సొంత గ్రామానికి వచ్చాడు. తమ్ముడు చున్నీ లాల్ను తండ్రి గురించి ఆరా తీశాడు. అయితే తండ్రి ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదంటూ చున్నీ లాల్ తొలుత బుకాయించాడు. సోదరులు గట్టిగా నిలదీయడంతో తండ్రిని చంపినట్లు చివరకు ఒప్పుకున్నాడు. దీంతో సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి ప్రాంగణంలో పాతిన మృతదేహాన్ని వెలికితీశారు. చున్నీ లాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.