భోపాల్: ఫ్యామిలీ ఫంక్షన్లో మ్యూజిక్ ఆఫ్ చేసినందుకు అన్నను గొడ్డలితో నరికి తమ్ముడు హత్య చేశాడు. (Man Kills Brother For Turning Off Music) అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఒక చోట దాక్కున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మౌహర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాకేష్ శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. సౌండ్ సిస్టమ్లో మ్యూజిక్ ప్లే చేయగా 30 ఏళ్ల తమ్ముడు రాజ్కుమార్ కోల్ డ్యాన్స్ చేశాడు.
కాగా, కొంతసేపటి తర్వాత మ్యూజిక్ సిస్టమ్ను రాకేష్ ఆఫ్ చేశాడు. అయితే మ్యూజిక్ ఆన్ చేయాలని, తాను డ్యాన్స్ కొనసాగిస్తానని రాజ్కుమార్ అన్నాడు. ఈ విషయంపై సోదరుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన రాజ్కుమార్ గొడ్డలితో అన్న రాకేష్ను నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కల్వర్టులో దాక్కున్న నిందితుడు రాజ్కుమార్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.