తిరువనంతపురం: లాటరీ టికెట్ (lottery ticket) విషయంపై ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని హత్య చేశాడు. కేరళలోని కొల్లం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన ఓనమ్ పండుగ సందర్భంగా 42 ఏళ్ల దేవదాస్, ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. స్నేహితుడు అజిత్కు ఆ లాటరీ టికెట్ ఇచ్చాడు. దానిని అతడి వద్ద ఉంచాలని కోరాడు.
కాగా, డ్రా తేదీ సమీపించడంతో లాటరీ టికెట్ను తిరిగి ఇవ్వాలని అజిత్ను దేవదాస్ బుధవారం అడిగాడు. మద్యం సేవించి ఉన్న వీరిద్దరి మధ్య ఈ విషయంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ తిట్టుకోవడంతోపాటు కొట్టుకున్నారు. ఆగ్రహించిన అజిత్ పదునైన ఆయుధంతో దేవదాస్పై దాడి చేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దేవదాస్ మరణించాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అజిత్ను గురువారం అరెస్ట్ చేశారు.