భోపాల్ : కండ్లు చెదిరే వేతనాన్ని కాలదన్ని వ్యవసాయం వృత్తిగా చేపట్టిన టెకీ తొలి సీజన్లోనే ఏకంగా రూ .20 లక్షలు సంపాదించేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. ఇండోర్లో మంచి ఉద్యోగం వదులుకున్న మధ్యప్రదేశ్ ఇంజనీర్ సాగు రంగంలో అద్భుతాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెబుతున్నాడు.
శివపురి జిల్లాలోని తర్రి గ్రామానికి చెందిన హర్షవర్ధన్ మజెజి బీటెక్ కంప్యూటర్స్ పూర్తిచేసి ఇండోర్లో టెకీగా కుదురుకున్నాడు, అయితే తన డ్రీమ్ ఇది కాదని తెలుసుకున్న తర్వాత మజెజి తన కుటుంబ నేపధ్యమైన వ్యవసాయాన్నే వృత్తిగా చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. సంప్రదాయేతర సాగుతో సిరులు పండించి రైతులకు భిన్నమైన మార్గాలను చూపించాలనే కసితో కార్యాచరణకు దిగాడు.
నీరు అధికంగా వాడాల్సిన పని లేకుండా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఎంచుకుని మెరుగైన ఫలితాలు రాబట్టానని మజెజి చెప్పుకొచ్చారు. 5 ఎకరాల్లో క్యాప్పికమ్ను సాగు చేయగా ఇప్పుడు 10,000 కిలోల దిగుబడి వచ్చిందని, కమాడిటీ ధరలు నిలకడగా ఉంటే తొలిసీజన్లోనే తాను రూ . 20 లక్షలు ఆర్జిస్తానని మాజీ టెకీ సగర్వంగా వెల్లడించారు.