న్యూఢిల్లీ : పెళ్లి పేరిట 100 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఫర్హాన్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నుంచి ఓ బీఎండబ్ల్యూ కారు.. ఏటీఎంలు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఓ మ్యాట్రిమోనియల్ పోర్టల్లో తాను ఓ వ్యక్తిని కలిశానని ఏయిమ్స్కు చెందిన ఓ వైద్యురాలు సౌత్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాను ఓ అవివాహితుడనని చెప్పున్న ఓ వ్యక్తి.. బిజినెస్ డీల్ పేరిట ఆమె నుంచి రూ.15లక్షలు దోపిడీ చేశాడని పేర్కొంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఫర్హాన్ మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. వర్కింగ్ మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. నిందితుడు చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమేనని.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు చనిపోయారని పేర్కొన్న నిందితుడు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా లక్ష్యంగా ఎంపిక చేసిన మహిళలను సంప్రదించి, వారిని నమ్మబలికే వాడు. ఆ తర్వాత ఏవో సాకులు చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకోనే వాడు. ఓ మహిళా వైద్యరాలిని సైతం మోసం చేయగా.. సదరు మహిళ మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డీసీపీ బెనిటా మేరి ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 18 రోజుల పాటు బృందం కష్టపడి నిందితుడిని పట్టుకుంది.
సదరు వ్యక్తి పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మహిళలను మోసం చేసినట్లు పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా ఫర్హాన్ మహిళలను మోసం చేస్తున్నాడని చెప్పారు. తనకు వ్యాపారాలున్నాయని, ఎంబీఏ, ఇంజినీరింగ్ చదివినట్లు మహిళలకు చెప్పి వారిని నమ్మించే వాడని ఆ తర్వాత వారి నుంచి డబ్బులు వసూలు చేశాక వారితో సంబంధాలను కట్ చేసుకునేవాడని వివరించారు.