షాజహాన్పూర్, ఆగస్టు 17: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైంది. తీవ్ర అనారోగ్య పరిస్థితులతో దవాఖానకు వెళ్లాలన్నా.. ఆఖరుకు మరణించిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలన్నా అంబులెన్స్ అందుబాటులో ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. ఆపత్కాల పరిస్థితుల్లో ఫోన్ చేస్తే 108 సిబ్బంది స్పందించరు. ఫలితంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇటువంటి ఘటనే షాజహాన్పూర్లోని జలాలాబాద్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది.
పట్టణానికి చెందిన దినేశ్ అనే వ్యక్తి తల్లి బీనాదేవి(65)కి తెల్లవారుజామున తీవ్ర కడుపునొప్పి వచ్చింది. 108కు ఫోన్ చేసినా.. ఎంతసేపటికీ అంబులెన్స్ రాలేదు. దీంతో దినేశ్ తన తల్లిని ఒక తోపుడు బండిపై పడుకోబెట్టి దాదాపు 4 కిలోమీటర్లు తోసుకుంటూ సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాడు. అయితే బీనాదేవి అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలన్నా అంబులెన్స్ లేకపోవడంతో తిరిగి అదే తోపుడు బండిపై నెట్టుకెళ్లారు.