న్యూఢిల్లీ : ఈ ప్రపంచంలో మనం ఏ స్ధానంలో ఉన్నా దయార్ధ్ర హృదయంతో మెలగాలన్నది చీఫ్ ఇన్స్పిరేషన్ ఆఫీసర్ అమితాబ్ షా అనుసరించే ఫిలాసఫీ. ఇంగ్లీష్ రాకపోవడంతో పాటు ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని ఓ వృద్ధ జంటకు అమితాబ్ షా ఆసరాగా నిలిచారు. అలిసిపోయిన వారికి ఆహారం సమకూర్చడంతో పాటు వారిని గమ్యస్ధానానికి క్షేమంగా చేర్చే వరకూ అన్నీ తానై చూసుకున్నాడు. వృద్ధ దంపతులు యూపీలోని మారుమూల గ్రామానికి చెందిన వారు కాగా విమానం ఎక్కడం కూడా వారికిదే తొలిసారని షా లింక్డిన్ పోస్ట్లో చెప్పుకొచ్చాడు. వృద్ధ దంపతుల ఫోటోను కూడా లింక్డిన్ పోస్ట్లో షేర్ చేశారు.
తాను నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కాన్పూర్కు వెళుతుండగా ఈ ఫోటోలో ఉన్న వృద్ధ దంపతులు కంటపడ్డారని, యూపీలోని మారుమూల గ్రామం నుంచి 8 గంటలు ప్రయాణించి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కాన్పూర్కు వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారని లింక్డిన్ పోస్ట్లో అమితాబ్ షా రాసుకొచ్చారు. బోర్డింగ్ ఏరియాలో వారు అమాయకంగా దిక్కులు చూస్తుండటం తాను గమనించానని, వారు విమానం ఎక్కడం ఇదే తొలిసారని, తమకు ఆంగ్లంలో మాట్లాడటం రాదని చెప్పగా తాను నవ్వుతూ తనను అనుసరించమని చెప్పానని అన్నారు. తాను ఎయిర్లైన్లో పనిచేస్తానని వారు భావించారని రాసుకొచ్చారు. తాము క్షేమంగా ఉన్నామని చెప్పేందుకు తనను, తన భర్త ఫోటో తీసి వాట్సాప్లో తమ కూతురికి పంపాలని వృద్ధ మహిళ అడిగారని చెప్పారు.
తాను వారి ఫోటో తీసి వారి కూతురుకు పంపానని తెలిపారు. ఎయిర్హోస్టెస్ ఫుడ్ సర్వ్ చేసేందుకు రాగా, వారు తీసుకునేందుకు నిరాకరించారని, కానీ వారి ఆకలితో ఉన్నట్టు గ్రహించిన తాను పనీర్ శాండ్విచ్లు, జ్యూస్ ఇవ్వాలని ఎయిర్హోస్టెస్కు సూచించి తాను డబ్బు చెల్లించానని చెప్పారు. వారికి మాత్రం మీరు లక్కీ కస్టమర్లు కావడంతో ఫ్రీగా ఫుడ్ ఇచ్చారని చెప్పానని గుర్తుచేసుకున్నారు. గమ్యస్ధానం చేరాక ఎవరి దారిన వారు వెళ్లే ముందు వృద్ద దంపతులు తనను చూసి నవ్వుతూ వీడ్కోలు పలికారని లింక్డిన్ పోస్ట్లో షా రాసుకొచ్చారు. షా ఔదార్యాన్ని తెలిపే ఈ పోస్ట్ పట్ల పలువురు స్పందిస్తూ షా రియాక్టయిన తీరు అద్భుతమని ప్రశంసలు గుప్పించారు.