న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా కేసులో వృద్ధురాలిపై మూత్రవిసర్జన కేసులో శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నవంబర్ 26న న్యూయార్క్ – ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శంకర్ మిశ్రా అనే వ్యక్తి 72 సంవత్సరాల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్లో మద్యం సేవించి మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత సదరు వ్యక్తిపై ఎయిర్స్లైన్స్ చర్యలు చేపట్టలేదని బాధితురాలు ఎయిర్ ఇండియా చైర్మన్కు రాసిన లేఖలో ఆరోపించింది. ఆ తర్వాత ఎయిర్లైన్స్ కంపెనీ ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదిలా ఉండగా.. వృద్ధురాలిపై మద్యం సేవించి మూత్రం పోసినట్లు వచ్చిన వార్తలను శంకర్ మిశ్రా ఖండించారు.
బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సదరు వృద్ధురాలే మూత్రం పోసుకుందని, ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని కోర్టుకు తెలిపారు. ఆమె కూర్చుతున్న సీటు వద్దకు వెళ్లరాదని, అక్కడికి వెళ్లినా సీటు వెనుక వైపు నుంచి మాత్రమే వెళ్లగలరని, నేను మద్యం మత్తులో ఆమె సీటు వద్దకు వెళ్లినా.. మూత్ర విసర్జన చేశానంటే వెనుక సీట్లో కూర్చున్న వారు ఫిర్యాదు చేయాలి కదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు నిరాకరించింది. అదే సమయంలో శంకర్ మిశ్రాకు సైతం బెయిల్ నిరాకరించింది.