Train | సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటారు. కొందరైతే ల్యాప్టాప్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం వాతావరణం చల్లగా ఉందని నీళ్లు కాచుకోవడానికి ఎలక్ట్రిక్ కెటిల్ను సాకెట్కు కనెక్ట్ చేశాడు. దీంతో అతన్ని రైల్వే పోలీసులు అరెస్టు కేసి కేసు నమోదు చేశారు.
గయా నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న మహాబోధి ఎక్స్ప్రెస్లో 36 ఏండ్ల వ్యక్తి ఇటీవల ప్రయాణించాడు. ఆ సమయంలో వేడి నీటి కోసం కెటిల్ను మొబైల్ చార్జింగ్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన సాకెట్లో ప్లగ్ చేశాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరానికి గానూ రైల్వే చట్టం సెక్షన్ 147(1) కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అలీగఢ్ కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి.. మొదటి తప్పు కింద భావించి.. వెయ్యి రూపాయల జరిమానా విధించడంతో పాటు హెచ్చరించి వదిలేశారు. కాగా, ’70 ఏండ్ల మహిళ మందులు వేసుకోవడానికి గోరు వెచ్చటి నీరు అవసరమయ్యిందని.. ప్యాంట్రీ కార్ సిబ్బందిని అడిగితే ఇవ్వలేదని.. దీంతో తానే స్వయంగా నీటిని వేడి చేయాల్సి వచ్చిందని’ సదరు ప్రయాణికుడు విచారణలో తెలిపినట్లు ఆర్పీఎఫ్ పోస్ట్ కమాండర్ రాజీవ్ వర్మ వెల్లడించారు.
రైల్వే చట్టంలోని సెక్షన్ 147(1) ప్రకారం రైల్వే ఆస్తులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే.. అతనికి ఆరు నెలల జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. కొన్సి సందర్భాల్లో రెండింటినీ అమలు చేయవచ్చు. అయితే చార్జింగ్ కోసం ఏర్పాటు చేసిన సాకెట్లలో హైవోల్టేజి ఎలక్ట్రిక్ వస్తువులు వాడటం కూడా రైల్వే ఆస్తుల దుర్వినియోగం కిందకే వస్తుంది. పైగా హైవోల్టేజి ఎలక్ట్రిక్ వస్తువులను సాకెట్కు కనెక్ట్ చేయడం ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రైల్వే పోలీసులు సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసి.. కోర్టు ముందు హాజరుపరిచారు.