న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్లో దారుణం చోటుచేసుకుంది. రైల్లో రద్దీని ఆసరాగా చేసుకుని పశ్చిమబెంగాల్కు చెందిన ఓ యువకుడు మైనర్ బాలికపై అమానుష చర్యకు పాల్పడ్డాడు. తన తల్లితో కలిసి రైల్లో నిలబడిన మైనర్ బాలిక పక్కన చేరి అసభ్య కార్యం చేశాడు. తోటి ప్రయాణికులు గమనించి నిందితుడిని పోలీసులకు పట్టించారు. ఢిల్లీ మెట్రోలోని రెడ్ లైన్లో బుధవారం రాత్రి ఈ జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాఖీ పండుగ కావడంతో బుధవారం ఢిల్లీలోని మెట్రో రైళ్లన్నీ రద్దీగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో రెడ్ లైన్కు చెందిన ఓ రైల్లో పశ్చిమబెంగాల్కు చెందిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ బాలిక పక్కనే హస్త ప్రయోగం చేసి, ఆమెపై వీర్యాన్ని స్కలించాడు. బాలిక తల్లి ఈ విషయాన్ని గమనించినా, భయంతో ఏమీ మాట్లాడకుండానే తన బిడ్డను తీసుకుని శీలంపూర్ స్టేషన్లో దిగిపోయింది.
అయితే, బాధితుల పక్కనే ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులు దీన్ని గమనించి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం షాహదారా స్టేషన్లో మెట్రో సిబ్బందికి అతడిని అప్పగించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన మెట్రో సిబ్బంది నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.