సొంత భార్యపైనే ఓ భర్త సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఆకేసును విన్న సుప్రీం కోర్టు కూడా షాక్ అయింది. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కేసుపై కోర్టు విచారణ చేపట్టాల్సి వచ్చింది. గ్వాలియర్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, భార్య తండ్రిపై చీటింగ్ కేసు పెట్టాడు. తన భార్యకు పురుషుల అంగం ఉందని.. ఆ విషయాన్ని దాచిపెట్టి మోసం చేసి తనతో పెళ్లి చేశారని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు.
2016లో వాళ్ల పెళ్లి జరిగింది. అయితే.. పెళ్లయిన కొన్ని రోజుల వరకు అతడిని ఆ యువతి ముట్టుకోనివ్వలేదు. కొన్ని రోజుల తర్వాత భర్త బలవంతంతో శృంగారానికి ఒప్పుకుంది. కానీ.. శృంగార సమయంలో భర్త.. తన జననేంద్రియాలను చూసి షాక్ అయ్యాడు. తనకు పురుషులకు ఉండే అంగం ఉందని తెలుసుకున్నాడు. దీంతో భార్యను మెడికల్ చెకప్కు తీసుకెళ్లాడు. దీంతో ఆమెకు congenital adrenal hyperplasia అనే డిజార్డర్ ఉందని తేలింది. అంటే.. మగవాళ్ల అంగం లాంటి అవయవం.. ఆమె జననేంద్రియాల వద్ద ఉండటం అన్నమాట. ఆ డిజార్డర్ నుంచి బయటపడాలంటే తనకు సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు.
దీంతో ఆ వ్యక్తి.. తన భార్యను పేరెంట్స్ దగ్గరికి పంపించేశాడు. అసలు విషయం చెప్పకుండా తనను మోసం చేసి ఆమెతో పెళ్లి చేశారని మండిపడ్డాడు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ కూతురును హింసిస్తున్నాడని మహిళ తల్లిదండ్రులు.. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే తన భార్య, మామ.. ఇద్దరూ మోసం చేసి తన మెడికల్ కండిషన్ గురించి చెప్పకుండా దాచిపెట్టారని ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశాడు.
ఆ తర్వాత ట్రయిల్ కోర్టులో ఈ కేసుపై పలుమార్లు విచారణ జరిగింది. ఆ మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టుకు కూడా వెళ్లింది. మధ్యప్రదేశ్ కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మెడికల్ రిపోర్ట్ ప్రకారం తనకు మహిళా జనేంద్రియాలు కూడా ఉన్నాయని.. కాబట్టి ఇందులో మహిళ తప్పేమీ లేదని కోర్టు తేల్చి చెప్పింది.
దీంతో అతడు ఏకంగా సుప్రీం కోర్టు తలుపే తట్టాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. విచారణ కోసం జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుంద్రేష్లతో కూడిన బెంచ్ను ఏర్పాటు చేసింది. అతడి తరుపు లాయర్ మాట్లాడుతూ.. తను ఖచ్చితంగా మగ వ్యక్తే. ఇది చీటింగ్ కిందికే వస్తుంది. మెడికల్ రిపోర్ట్స్ను చెక్ చేయండి. ఒక పురుషుడితో మరో పురుషుడికి వివాహం ఎలా చేస్తారు. తన జననేంద్రియాల గురించి తనకు ముందే తెలుసు. అయినా కూడా ఈ విషయాన్ని దాచిపెట్టారు.. అని కోర్టుకు విన్నవించాడు. దీంతో కోర్టు.. ఆ మహిళకు, ఆమె తండ్రికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది.