భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణాలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి బట్టలు ఇప్పించి నగ్నంగా చేసిన కొందరు పైపులతో అతడ్ని కొట్టారు (Man stripped and thrashed). ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని సాగర్లో ఈ సంఘటన జరిగింది. దొంగతనం ఆరోపణలపై ఒక వ్యక్తిపై కొందరు దాడి చేశారు. బలవంతంగా అతడి దుస్తులు విప్పించారు. నగ్నంగా మారిన ఆ వ్యక్తిని ప్లాస్టిక్ పైపులతో కొట్టారు. చేతులు, కాళ్లపై దారుణంగా బాదారు. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్ కాంత ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, మధ్యప్రదేశ్లో వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియో క్లిప్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల కిందట సిద్ధి జిల్లాకు చెందిన ఆదివాసీ వ్యక్తిపై బీజేపీ నేత అనుచరుడు మూత్రం పోశాడు. మూడేళ్ల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఇటీవల వైరల్ అయ్యింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జూన్ 30న శివపురి జిల్లాలోని వర్ఖాడి గ్రామానికి చెందిన బాలికలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు దళిత వ్యక్తులను ముస్లిం కుటుంబీకులు కొట్టారు. వారి మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ వీడియో క్లిప్ కూడా వైరల్ అయ్యింది.
మరోవైపు మధ్యప్రదేశ్లో మరో అమానుష సంఘటన జరిగింది. గ్వాలియర్లో కొంతమంది ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు. కారులో తీసుకెళ్తూ దాడికి తెగబడ్డారు. బాధితుడితో బలవంతంగా పాదాల్ని నాకించి వికృతంగా ప్రవర్తించారు. అలాగే షజాపూర్ జిల్లాలో దళితుడి పెండ్లి బరాత్పై గ్రామంలోని పెత్తందార్లు రాళ్లదాడికి దిగారు. ఇండోర్లో ఒక మైనర్ బాలుడితో సహా ఇద్దరు గిరిజనులను ఎనిమిది గంటల పాటు బందీగా ఉంచారు. రోడ్డుపై వాగ్వాదం నేపథ్యంలో వారిని కొట్టి నిర్బంధించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.