గోవాలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే గోవా ఎన్నికల గోదాలోకి దిగామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఓటర్లను విడదీయడానికి తాము రాలేదని, ఓటర్లందర్నీ సంఘటితపరిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే వచ్చామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తాము బీజేపీకి ప్రత్యామ్నాయమని, ఈ విషయంలో తమకు ఎవరైనా మద్దతిస్తామని భావిస్తే అది వారి స్వేచ్ఛకే వదిలేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం గోవాలో పర్యటించారు. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న దృఢ సంకల్పంతోనే తాము రంగంలోకి దిగామని, ఇక వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని ఆమె తేల్చి చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో గెలుస్తామన్న కచ్చితమైన ధీమా మీకుందా? అని మమత కార్యకర్తలను సూటిగా ప్రశ్నించారు. గెలుస్తామన్న కచ్చితమైన ధీమా ఉంటే మాత్రం ఇక వెనక్కి తిరిగి చూడొద్దని, కార్యక్షేత్రంలో విజృంభించాలని మమత పిలుపునిచ్చారు. తాను ఎంత బెంగాలీయో… అంత గోవా వ్యక్తిని కూడా అని, తనకు స్థానిక భాష తెలుసని మమత ప్రకటించారు. ఇక గోవాలో ఉన్న ఎన్సీపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే అలెమావో చర్చిల్ సీఎం మమత సమక్షంలో టీఎంసీలో చేరిపోయారు. ఎన్సీపీ శాసనసభా పక్షాన్ని టీఎంసీలో కలిపేశారు. ఈ మేరకు చర్చిల్ స్పీకర్కు కూడా లేఖ రాశారు.