నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నా
ఏంచేస్తారో చేస్కోండి.. విజయం మాదే: మమత
ఒకే దఫాలో అభ్యర్థుల జాబితా విడుదల
కోల్కతా, మార్చి 5: తమకు తొలిసారిగా అధికారం దక్కడానికి కారణమైన పోరుగడ్డ నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 291 మంది అభ్యర్థుల జాబితాను ఒకే దఫాలో శుక్రవారం ఆమె విడుదల చేశారు. వీరిలో 114 మంది కొత్తవాళ్లే కావడం విశేషం. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన నందిగ్రామ్ ప్రస్తుత ఎమ్మెల్యే సువేందు అధికారిపై పోటీ చేస్తానని మమత జనవరిలో ప్రకటించారు. జాబితా విడుదల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాపై మమత నిప్పులు చెరిగారు. ‘మీరు ఎన్ని చేయాలో అన్ని చేసుకోండి.. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. చివరికి ఘనవిజయం సాధించేది తృణమూల్ కాంగ్రెస్సే’ అన్నారు. 2007లో అప్పటి వామపక్ష ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో నాడు తమ పార్టీలో ఉన్న సువేందు అధికారితో కలిసి మమత భారీ ఉద్యమాన్ని చేపట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఫలితంగా 34 ఏండ్ల వామపక్ష పాలన అంతమై 2011లో మమత అధికారాన్ని చేపట్టారు.