కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి వచ్చేవారం గోవాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె అక్టోబర్ 28న గోవాకు వెళ్లనున్నట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆరంభంలో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గోవాలో మమతా బెనర్జి పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు చిన్న రాష్ట్రాలైన త్రిపుర, గోవాల్లో అధికారం దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది. ఆ మేరకు ప్రణాళికాబద్దంగా పావులు కదుపుతున్నది. ఇప్పటికే మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జి త్రిపురలో పర్యటించి అక్కడి ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఇప్పుడు మమతాబెనర్జి గోవాలో అదేపని చేసేందుకు వస్తున్నారు.
ఇటీవల గోవా మాజీ ముఖ్యమంత్రి లూయీజిన్హో ఫలేయిరో, పలువురు కాంగ్రెస్ నేతలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా పర్యటనలో మమత వారితో సమావేశం కానున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇంకా ఇతర పార్టీల్లోని కీలక నేతలను తృణమూల్ కాంగ్రెస్లోకి ఆహ్వానించడం తదితర అంశాలపై అక్కడి టీఎంసీ నేతలతో చర్చించనున్నారు. కాగా, మమత గోవా టూర్తో తృణమూల్కు ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.