కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. బీజేపీకి చెందిన ప్రియాంకా టిబ్రేవాల్పై ఆమె 58,832 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మమతా.. ఆ తర్వాత ప్రతి రౌండ్కూ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ తరఫున కొత్త రికార్డు. గతంలో 2011లో 34 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టుల కోటను బద్దలుకొట్టి మమతా తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆ పార్టీ తరఫున 49,936 ఓట్ల మెజార్టీ నమోదైంది. ఇప్పుడా రికార్డును మమతా బెనర్జీ బ్రేక్ చేశారు.
మొత్తంగా మమతకు 84,709 ఓట్లు రాగా.. ప్రియాంకాకు 26,320 ఓట్లు వచ్చాయి. తన ఓటమిని ప్రియాంకా అంగీకరించారు. అయితే వాళ్లు లక్షకుపైగా మెజార్టీ గెలుస్తామని చెప్పారని, ఇప్పుడు అది 50 వేలకే పరిమితమైందని ఆమె అన్నారు. మరోవైపు తనను గెలిపించిన భవానీపూర్ ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడ 46 శాతం మంది బెంగాలీ కాని ఓటర్లు ఉన్నారు. వాళ్లంతా నాకే ఓటేశారు. నాపై నమ్మకం ఉంచినందుకు సంతోషం. భవానీపూర్ ప్రజలకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని మమతా అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇన్నాళ్లూ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. ఆ పదవిలో కొనసాగాలంటే ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఆమె బంపర్ మెజార్టీతో గెలిచారు.