ముంబై: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది ముంబై పర్యటన సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుకు సంబంధించి మార్చి 2న తమ ఎదుట హాజరు కావాలంటూ ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
కాగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత ఏడాది డిసెంబర్లో ముంబైలో పర్యటించారు. శివసేన, ఎన్సీపీ నేతలను ఆమె కలిశారు. ఈ టూర్లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలపన జరుగగా మమత లేచి నిల్చోలేదని, మధ్యలోనే స్టేజి దిగిపోయారని ఆరోపణలు వచ్చాయి. ముంబైకి చెందిన బీజేపీ నేత వివేకానంద గుప్తా దీనిపై స్థానిక కోర్టును ఆశ్రయించారు. జాతీయ గీతాన్ని మమత అవమానించారని ఆయన ఆరోపించారు. ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్తో కూడిన డీవీడీని కోర్టుకు సమర్పించారు.
మరోవైపు సీఎం మమతపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు, వీడియోను ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పరిశీలించింది. “నిందితురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆమె తన అధికారిక విధులను నిర్వర్తించలేదు. అది ఆమె అధికారిక కార్యక్రమం కానందున ఎలాంటి అనుమతి అవసరం లేదు. కేసుపై విచారణ కొనసాగడానికి ఎటువంటి అడ్డంకి లేదు” అని కోర్టు పేర్కొంది. ఈ ఫిర్యాదుకు సంబంధించి మార్చి 2న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.