కోల్కతా : విపక్ష ఇండియా కూటమి భేటీకి గైర్హాజరవుతారని భావిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడైతే సానుకూల తేదీతో ముందుకొస్తే విపక్ష నేతలు త్వరలోనే సమావేశమవుతారని తదుపరి భేటీని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. తనకు ఇండియా కూటమి సమావేశం గురించి ముందుగా సమాచారం ఇవ్వలేదని, కేవలం సోమవారమే రాహుల్ ఫోన్ చేసి భేటీ గురించి చెప్పారని దీదీ తెలిపారు.
వారు ఎప్పుడు సమావేశం గురించి నిర్ణయస్తే తామంతా త్వరలోనే కలుస్తామని ఆమె పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్స్ ప్రకారం పర్యటనలు ఉంటాయని చెబుతూ సీఎంలకు కనీసం వారం, పది రోజులు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఇతర సీఎంలకు కూడా ముందస్తుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు.
ఇక తమిళనాడులో మిచౌంగ్ తుపాన్ బీభత్సంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ ఆ రాష్ట్రానికి ఎలాంటి సాయం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తాను ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున విపక్ష భేటీకి హాజరు కాలేకపోతున్నానని ఆమె వెల్లడించారు. తన కుటుంబంలో ఒక వివాహ వేడుక జరుగుతున్నదని, పెండ్లి తర్వాత వధూవరులు తన ఆశీస్సుల కోసం వస్తున్నారని మమతా బెనర్జీ తెలిపారు.
Read More :