కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా రూపొందించిన భారీ ఫుట్బాట్ శిల్పాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. కోల్కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియానికి గుర్తింపుగా ఉన్న ఈ శిల్పం శనివారం ధ్వంసం కావడం చూసి స్థానికులు నివ్వెరపోయారు. (football sculpture demolished) మమతా బెనర్జీ ఆలోచనతో రూపొందించిన ఆ శిల్పాన్ని 2017లో ఫీఫా అండర్-17 ప్రపంచ కప్కు ముందు ఏర్పాటు చేశారు. గత టీఎంసీ ప్రభుత్వపు చిహ్నమైన ‘బిస్వా బంగ్లా’ లోగో కూడా కూడా దీనిపై ఉన్నది.
కాగా, మొండెంపై ఫుట్బాల్ ఉన్న ఈ స్టాట్యూపై పలు విమర్శలు కూడా వచ్చాయి. దీనిని ఆవిష్కరించినప్పటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఈ విచిత్ర డిజైన్ను పలువురు ఫుట్బాల్ అభిమానులు ప్రశ్నించారు. అయినప్పటికీ అనేక ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియానికి ఒక గుర్తింపుగా అది నిలిచింది.
మరోవైపు బెంగాల్లో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి, ఆ మరునాడే ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని ప్రకటించారు. క్రీడల మంత్రి నిసిత్ ప్రమాణిక్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. ప్రఖ్యాత స్టేడియం సౌందర్యానికి ఆ ‘వికృతమైన’ నిర్మాణం ఏమాత్రం తగినది కాదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ శిల్పాన్ని కూల్చివేసింది. ఇటీవల ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఆతిథ్యం ఇచ్చిన సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేటు సమీపంలో ఉన్న ఈ శిల్పాన్ని శనివారం ఉదయం తొలగించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ‘సాల్ట్ లేక్ స్టేడియం ముందున్న ఆ అసహ్యకరమైన నిర్మాణం గుర్తుందా? మాటిచ్చినట్లుగానే దానిని తొలగించాం’ అని బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ ట్వీట్ చేశారు.