కోల్కతా : అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్, ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్ట్లపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బీజేపీ సోషల్ మీడియా నకిలీ వీడియోలతో అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని దీదీ మండిపడ్డారు.
బీజేపీ నేతలు దుష్ర్పచారం సాగిస్తూ ఇతరులను అవమానిస్తుంటే వారిని అరెస్ట్ చేయకుండా కాషాయ పాలకులు మౌనం దాల్చుతారని, వారు ప్రజలను చంపుతున్నా పట్టించుకోరని ఆరోపించారు. ఎవరైనా వాస్తవాలు మాట్లాడితే మాత్రం వారిని టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఏం నేరం చేశారని జుబేర్, తీస్తా సెతల్వాద్లను అరెస్ట్ చేశారని ఆమె మోదీ సర్కార్ను నిలదీశారు. ఇవాళ ప్రపంచమంతా వీరి అరెస్ట్లను ఖండిస్తోందని అన్నారు.
ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో జుబేర్ను ఢిల్లీ పోలీసులు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. 2020లో ఓ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు జుబేర్ను పిలిపించిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. ఇక 2002 గుజరాత్ అల్లర్లలో అమాయకులను ఇరికించేలా ఆధారాలను కల్పించారనే ఆరోపణలపై సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్బీ శ్రీకుమార్లను అరెస్ట్ చేశారు. జులై 2 వరకూ వీరు గుజరాత్ పోలీసుల కస్టడీకి తరలించారు.