కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర అల్లర్లపై ఎన్హెచ్ఆర్సీ నివేదిక బహిర్గతం కావడం పట్ల సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. న్యాయవ్యవస్ధను గౌరవించాలని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ కక్షసాధింపు కాకుంటే ఈ నివేదికను వారు ఎలా లీక్ చేస్తారని దీదీ నిలదీశారు. బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై పాలక తృణమూల్ సర్కార్ పాత్రను తప్పుపడుతూ ఎన్హెచ్ఆర్సీ తుది నివేదికను కలకత్తా హైకోర్టుకు గురువారం సమర్పించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు బయటకు రావడం పట్ల దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెంగాలీల ప్రతిష్టను దిగజార్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజకీయ కక్షసాధింపునకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు, ఇతర ఏజెన్సీలను వాడుతూ ప్రత్యర్ధులపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బెంగాల్కు సరిపడా కొవిడ్-19 వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేయడం లేదని ఆరోపించారు. తమకు 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమైతే ఇప్పటివరకూ కేవలం 2.12 కోట్ల వ్యాక్సిన్లనే పంపారని తెలిపారు. 18 లక్షల వ్యాక్సిన్లను సొంతంగా తాము కొనుగోలు చేశామని చెప్పారు. కొన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు భారీగా పంపుతుండగా మరికొన్ని రాష్ట్రాలకు తక్కువగా పంపుతున్నారని అన్నారు.