పనాజి: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గోవా వెళ్లారు. గోవా అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించిన ఆమె ఆదివారం గోవా చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తారు. సోమవారం, మంగళవారం గోవాలోని టీఎంసీ నేతలతో మమత సమావేశమవుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి క్రియాశీలక రాజకీయాలపై ఆమె దృష్టిసారించారు. అక్టోబర్ చివరి వారంలో గోవాలో మమత నాలుగు రోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, కాంగ్రెస్ నాయకురాలు, నటి నఫీసా అలీ టీఎంసీలో చేరారు.
మరోవైపు తాజాగా మమతతోపాటు టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీలో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా ఆదివారం గోవా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గోవాకు చెందిన పలువురు ప్రముఖులు టీఎంసీలో చేరవచ్చని తెలుస్తున్నది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే అలెమా చర్చిల్తోపాటు మరికొందరు టీఎంసీలో చేరుతారని సమాచారం.
కాగా, అలెమా 2014లో టీఎంసీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో దక్షిణ గోవా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎన్సీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.