Loksabha Elections 2024 : పుదుచ్చేరికి పూర్తిస్ధాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమవారం జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ తాము ఏది చెప్పినా దాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు.
కానీ ప్రధాని మోదీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం కేవలం కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకే సాధ్యమని అన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించే అంశం బీజేపీ మేనిఫెస్టోలో కనీసం ప్రస్తావనకు నోచుకోలేదని గుర్తుచేశారు.
బీజేపీ మేనిఫెస్టో పుదుచ్చేరి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఈ అంశంపై ఓ వైఖరి తీసుకుందని 2024 లోక్సభ ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి రాగానే హామీని నెరవేరుస్తామని ఖర్గే స్పష్టం చేశారు.
Read More :
Byjus | ఆరు నెలలకే సీఈవో రాజీనామా.. రవీంద్రన్కు బైజూస్ ఇండియా బాధ్యతలు