Karnataka CM | బెంగళూరు, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గత మూడు రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై హస్తం అధిష్ఠానం చర్చోపచర్చలు చేస్తున్నది. వీరిద్దరితో పాటు రాహుల్, ఇతర సీనియర్ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మంగళవారం వేర్వేరుగా భేటీలు నిర్వహించారు. వీరిద్దరిలో ఒకరి పేరు ప్రకటించి.. రెండో వ్యక్తి అసంతృప్తి చెందకుండా ఉండేలా పలు పవర్ ఫార్ములాలపై అధిష్ఠానం చర్చలు జరుపుతున్నది.
ఈ నేపథ్యంలో మంగళవారం కర్ణాటక కొత్త సీఎం ఎవరో తెలిసిపోతుందని అనుకొన్నా అది జరుగలేదు. సోనియా, రాహుల్తో తుది చర్చలు జరిపిన తర్వాత ఖర్గే కొత్త సీఎం ఎవరనే దానిపై బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం ఎంపికపై ఆలస్యం లేదని, చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో సీఎం ఎవరనేది ఖర్గే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కొత్త సీఎం ఎంపికపై అధిష్ఠానం ఆలస్యం చేసే కొద్దీ కొత్త ఆశావహుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు ఆయా వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అధిష్ఠానం తల పట్టుకొంటున్నది.
పలు ఫార్ములాలపై చర్చలు
కొత్త సీఎం ఎంపికను సోనియా, రాహుల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆ రాష్ర్టానికే చెందిన మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్టు తెలుస్తున్నది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లో ఒకరిని సీఎం చేయాలా? లేక వీరిద్దరికి సీఎం సీటును చెరి రెండున్నర ఏండ్లు పంచాలా? లేక సిద్ధరామయ్యను సీఎం చేసి, పలు కీలక శాఖలతో డీకేకు డిప్యూటీ సీఎం ఇవ్వాలా? ఇలా పలు ఫార్ములాలపై అధిష్ఠానం కీలక చర్చలు చేస్తున్నది. ఇందులో భాగంగా అధిష్ఠానం పిలుపు మేరకు సిద్ధరామయ్య సోమవారమే ఢిల్లీ చేరుకోగా.. డీకే మాత్రం మంగళవారం వెళ్లారు. మొదట డీకేతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు, సిద్ధరామయ్యతో 6.30 గంటల తర్వాత ఖర్గే భేటీ అయ్యారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఖర్గేతో సమావేశం సందర్భంగా సోనియా గాంధీ అభిప్రాయాన్ని డీకే కోరినట్టు తెలిసింది.
ఖర్గేతో నేతల అంతర్గత సమావేశం
మరోవైపు సీఎం ఎంపిక విషయంపై మంగళవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో కీలక నేతల అంతర్గత సమావేశం జరిగింది. ఈ భేటీకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్తో పాటు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కొత్త సీఎంగా సిద్ధరామయ్య వైపు రాహుల్ మొగ్గుచూపినట్టు సమాచారం. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎన్నుకొంటే బాగుంటుందని రాహుల్, కేసీ వేణుగోపాల్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
వెన్నుపోటు పొడవను: డీకే
ఖర్గేతో సమావేశానికి ముందు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానంటూ వచ్చిన వార్తలను ఖండించారు. పార్టీ తనకు తల్లి వంటిదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని డీకే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘ఇది నా పార్టీ. 135 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే’ అని వ్యాఖ్యానించారు. సీఎం ఎవరు కావాలనే అంశంపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకొంటుందని అన్నారు. అంతకుముందు ఢిల్లీకి బయలుదేరే ముందు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తాను ఎవరికీ వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని చెప్పారు.
ఆలస్యంతో పెరుగుతున్న ఆశావహులు
కర్ణాటక సీఎం ఎంపిక ఆలస్యం అయ్యే కొద్దీ ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతున్నది. తమ నాయకుడిని సీఎం చేయాలంటూ మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మంగళవారం తుమకూరులో భారీ ర్యాలీ చేపట్టారు. ‘దళితుడిని సీఎం చేయాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘నేనూ 50 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లి బలప్రదర్శన చేయగలను. కానీ అలా చేయడం తగదు’ అని పరమేశ్వర వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
మరోవైపు లింగాయత్ కమ్యూనిటీ నుంచి 34 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారని, వారిలో ఒకరిని సీఎంను చేయాలని ఆలిండియా వీరశైవ మహాసభ.. కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాసింది. సిద్ధరామయ్య, డీకేల్లోనే ఎంపిక చేయలేకపోతుంటే.. ఇప్పుడు కొత్త డిమాండ్లు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తల పట్టుకొంటున్నది. ముస్లింలు, ఈడిగలు డిప్యూటీ సీఎం పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఎవరి వాదనలు ఏంటి?
సిద్ధరామయ్య
డీకే శివకుమార్