Mallikarjun Kharge | బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బార్గా ఎంపీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని, కాంగ్రెస్ జాబితాలో కూడా పేరు చేర్చినట్లు తెలిసింది. కానీ ఖర్గే తన అల్లుడు రాధాకృష్ణన్ దొద్దమణిని గుల్బార్గా నుంచి బరిలో దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మల్లికార్జున్ ఖర్గే గుల్బార్గా నుంచి రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే కొనసాగుతున్నారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం మరో నాలుగేండ్లు ఉంది.
ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా గుల్బార్గా నుంచి పోటీ చేసే అవకాశం లేదని సమాచారం. దీంతో అల్లుడిని బరిలోకి దించాలని ఖర్గే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తన ఒక నియోజకవర్గానికి పరిమితం కాకూడదని, దేశమంతటా తన సేవలు అవసరం ఉన్నాయని ఖర్గే తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎలక్షన్స్కు దూరంగా ఉంటున్నట్టు సమాచారం.
అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఛీప్లుగా పని చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిద్దరూ కూడా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో అమేథి నియోజకవర్గంలో స్మృతి ఇరానీపై రాహుల్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన వయనాడ్ నుంచి గెలుపొందారు.