పట్నా : మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్లో మద్యం విక్రయాలు, నిల్వలపై నిరంతరం దాడులు, సోదాలు సాగుతున్నాయి. మద్యం నిల్వలున్నాయనే సమాచారంతో బిహార్ రాజధాని పట్నాలో ఓ మ్యారేజ్ హాల్లో పెండ్లి కూతురి రూంలోకి మగ పోలీసులు చొరబడి సోదాలు చేపట్టడం కలకలం రేపింది. ఆడ పోలీసులు లేకుండా వధువు గదిలో సోదాలు చేపట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వధువు గదిలో పోలీసుల తనిఖీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అమాయక ప్రజలను పోలీసులు అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. నితీష్ కుమార్ ప్రభుత్వం అక్రమంగా మద్యం విక్రయాలను చేపడుతోందని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర ఆరోపించారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు జరుపుతున్నామని భ్రమలు కల్పించేలా అమాయకులపై బూటకపు సోదాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.