తిరువనంతపురం : మలయాళం టీవీ చానెల్ మీడియా వన్పై కేంద్రం నిషేధం విధించింది. ఇప్పటికే ఈ టీవీ చానెల్పై రెండు రోజుల పాటు నిషేధం విధించిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మరోసారి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30, 2021 నుంచి సెప్టెంబర్ 29, 2031 వరకు టీవీ చానెల్ లైసెన్స్ను రెన్యూవల్ చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు మీడియా వన్ చానెల్ దరఖాస్తు పెట్టుకుంది. ఈ దరఖాస్తును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తిరస్కరించడంతో మీడియా వన్పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
2020, మార్చి నెలలో ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా మలయాళం చానల్స్ ఏసియన్ నెట్, మీడియా వన్ ప్రసారాలు చేశాయని కేంద్రం గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు చానెల్స్పై రెండు రోజుల పాటు నిషేధం విధించారు. ఆ చర్యలకు అనుగుణంగానే మరోసారి మీడియా వన్ చానెల్పై కేంద్రం నిషేధం విధించింది.
ఈ పరిణామాల మధ్య మీడియా వన్ టీవీ ఎడిటర్ ప్రమోద్ రమణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ చానెల్పై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధం విధించిందని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తమ చానెల్పై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది. కానీ వివరాలు ఇప్పటి వరకు తమకు అందలేదన్నారు. మీడియా వన్ చానెల్ నిషేధంపై న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రజల ముందుకు మీడియా వన్ ప్రసారాలను తీసుకొస్తామని ఎడిటర్ ప్రమోద్ రమణ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి చానెల్ ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఎడిటర్ తెలిపారు.