బెంగళూరు, జూలై 7: దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అవమానకరమైన, బాధ్యతారాహిత్యమైన చర్యేనని, కానీ దేశ ద్రోహం మాత్రం కాదని కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఓ పాఠశాల యాజమాన్యంపై దేశ ద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.
బీదర్లోని ఓ పాఠశాలలో పౌర సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్షిప్ (ఎన్ఆర్సీ)పై గతంలో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానించారంటూ ఆ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదైంది. కలబురిగి బెంచ్ న్యాయమూర్తి హేమంత్ చందన్గౌడర్ ఈ కేసును విచారించారు. ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని న్యాయస్థానం తెలిపింది.