తిరువనంతపురం: మకర సంక్రాంతి పర్వదినాన పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు అయ్యప్పస్వామి మకరజ్యోతి ( Makar Jyothi ) రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. పొన్నాంబలమేడు పైనుంచి మకరజ్యోతి మూడుసార్లు కనిపించింది. జ్యోతిని చూడగానే భక్తులంతా తన్మయత్వానికి లోనయ్యారు.
అంతకుముందు స్వర్ణాభరణాలు ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు పూర్తయిన తర్వాత భక్తులకు జ్యోతి దర్శనం అయ్యింది. మకరజ్యోతి కనిపించే రోజున శబరిమలలో ఎప్పుడైనా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కొవిడ్ కారణంగా ఈసారి పరిమితులు విధించినా భక్తులు భారీగానే పోటెత్తారు.
శబరిగిరుల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జ్యోతిని దర్శించుకున్నారు. కాగా, మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో అయ్యప్పస్వామి ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.