స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి737 విమానం గాలిలో ఒక్క సారిగా కుదుపులకు గురైంది. దీంతో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే వారి ప్రాణాలకు వచ్చే ముప్పు లేదని వైద్యులు స్పష్టం చేశారు. ముంబై నుంచి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్కు ఈ విమానం బయల్దేరింది.
దుర్గాపూర్కు చేరుకొని, ల్యాండ్ అయ్యే సమయానికి ముందు ఈ కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతోనే ఇలా కుదుపులకు లోనైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు స్పైస్ జెట్ సంస్థ పేర్కొంది. ఇంత భారీ కుదుపులకు కారణాలేంటని అధికారులు విచారణ చేయనున్నారు. మరోవైపు ఈ కుదుపుల కారణంగా లగేజీ క్యాబిన్ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ప్రయాణికులపై లగేజీ కూడా పడింది.