న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోగల ఓ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గమున్న ఫ్లరిష్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదం నుంచి పలువురిని కాపాడినప్పటికీ మరికొందరు మంటల్లో చిక్కుకుని ఉంటారని తెలుస్తున్నది. స్థానికులు రోడ్డుపై పరుపులు పరచడంతో భవనంలోని మూడవ అంతస్తులో చిక్కుకున్న పలువురు వ్యక్తులు పైనుంచి కిందికి దూకారు. ఓ మహిళ తన చంటిబిడ్డను పట్టుకుని 3వ అంతస్తు నుంచి కిందకు దూకగా ఆమెకు కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డీఎఫ్ఎస్తోపాటు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు, అంబులెన్సు సర్వీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హోటల్లో బస చేసిన విదేశీయులు సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా నుంచి చికిత్స కోసం వచ్చినట్లు అధికారులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పథకం కింద ఈ హోటల్ నడుస్తున్నది. మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదు.