Maithili Thakur : తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు. మరో నెల రోజుల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మైథిలీ ఠాకూర్ తాజాగా తన తండ్రితో కలిసి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వినోద్ తావ్డే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్లను కలిశారు.
దాంతో మైథిలీ ఠాకూర్ రాజకీయాల్లోకి వస్తున్నారని, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈ విషయంపై ప్రశ్నించగా ప్రజలకు సేవ చేసేందుకు ఆ అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పారు. మైథిలీ ఠాకూర్ అంశంపై వినోద్ తావ్డే కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మైథిలీ ఠాకూర్ను ‘బీహార్ మానస పుత్రిక’ గా అభివర్ణించారు. 1995లో లాలూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీహార్ను విడిచిపెట్టి వెళ్లిన కుటుంబాలు తిరిగి వస్తున్నాయని, అలాంటి ఓ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డనే మైథిలీ ఠాకూర్ అని పేర్కొన్నారు.
మైథిలీ ఠాకూర్ బీహారీలకు తన సేవలు అందిస్తారని, ఇక్కడి ప్రజల ఆశయాలను నెరవేరుస్తారని తావ్డే రాసుకొచ్చారు. అయితే తావ్డే స్పందనపై మైథిలీ ఠాకూర్ ఆనందం వ్యక్తంచేశారు. తావ్డే తనను అభినందించడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. ముందుగా తనకు రాజకీయాలంటే ఇష్టం ఉండేది కాదని, ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకున్న తర్వాత రాజకీయాలపై ఇష్టం పెరిగిందని చెప్పారు. ‘మధుబని నుంచి పోటీ చేస్తారా.. దర్బంగా నుంచి పోటీ చేస్తారా..?’ తన తల్లిది మధుబని, తండ్రిది దర్భంగా అని.. రెండూ తనకు ఇష్టమేనని, అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.